Wednesday 2 August 2017

యేవితల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు!

కాఫీ ఆలోచన (కాఫీ తాగేప్పుడు వచ్చిన ఆలోచన) :

నేను చదూకునే రోజుల్లో మెడికల్ కాలేజిలో చెట్లు, క్రోటన్స్‌తో అందమైన తోట వుండేది. ఆ తోటలో సిమెంట్ బెంచీఅ మీద కూచుని రకరకాల కబుర్లు, చర్చలు. ఆరోజు థియరీ క్లాసులో ముఖ్యమైన పాయింట్లు.. ఇందిరాగాంధీ ఎమర్జన్సీ దురాగతాలు.. వియత్నాంలో అమెరికా దుర్మార్గాలు.. అయోధ్యలో రామాలయం తలుపులు.. అమెరికా సోవియట్ల కోల్ద్ వార్.. అదొక ఓపెన్ ఫోరం.

1970 లలో యెంతో చైతన్యంతో కళకళ్లాడిన విద్యార్ధిలోకం ఆ తరవాత అనేక ఆటుపోట్లకి గురైంది.

టీవీలొచ్చేశాయ్, లైవ్ ప్రసారాలతో వల్ల క్రికెట్ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింద్. టీవీలో వార్తలు వస్తుంటే న్యూస్‌పేపరెందుకు దండగ అనే ఆలోచన మొదలైంది. ఇంకొన్నాళ్లకి కార్పొరేట్ విద్యాసంస్థలొచ్చేశాయ్, కేజీల చదువులు మొదలైనయ్. విద్యార్ధిలోకం చదువుల్తో, క్రికెట్‌తో బిజీబిజీ.. పుస్తకాలు చదవడం తగ్గిపోయింది.

"ఇరాక్ మీద అమెరికా యుద్ధం సరికాదు!"

"యెక్కడోవున్న ఇరాక్ గూర్చి నీకెందుకు? చదువుకో, బాగుపడతావ్!"

సెల్ ఫోన్లొచ్చేశాయ్!

"గుజరాత్ మారణకాండ దారుణం!"

"గుజరాత్ గూర్చి మనకెందుకు బ్రదర్? సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చుగా!"

స్మార్ట్ ఫోన్లొచ్చేశాయ్!

"పాకిస్తాన్ తన దేశప్రజల్ని యేమార్చడానికి మతరాజకీయాల్ని ప్రమోట్ చేస్తుంది."

"పాకిస్తాన్‌ ముస్లిం దేశం, ఒక ఆటం బాంబ్ వేసేస్తే పీడా విరగడవుతుంది."

ఇవ్వాళ యెవరికీ యెవర్తో సంబంధాల్లేవ్. సమాజం గూర్చి కాదు, పక్కింటివాడి గూర్చి ఆలోచించే ఆసక్తి లేకుండాపోయింది.

ఆధిపత్య కులాల ఆరాటం, వారి అణచివేత ఆలోచనలూ మర్యాదస్తుల భావజాలంగా మారిపోయింది. రాజకీయ పార్టీ నాయకులు, సినిమా హీరోలు కులాలవారిగా తమవారిని ప్రమోట్ చేసుకోడం మొదలెట్టారు.

ఫలితంగా -

యువత సినిమా హీరోల వెంట పడ్డారు. తమ హీరో రాజకీయాల్లోకొచ్చి తమని ఉద్ధరించాలనే పనికిమాలిన వాదం మొదలైంది. బహుశా రాజకీయ భావజాలంలో ఇంతకుమించిన భ్రష్టత్వం మరేదీ లేదు.

తెలుగునాట తెలుగు తగ్గుతుందని బాధపడుతున్నారు కొందరు. అసలు ఆలోచించే సమాజమే కుంచించుకుపోయిందని నా ఆవేదన.

'యేవితల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు!'

(fb post)